సూర్యాపేట : మానవ సమాజంలో మంచిని గ్రహించాలి అన్నదే రామాయణ పరమార్థం అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. వందలు, వేలు, లక్షల సంవత్సరాల నుంచి శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడం అంటే మంచి అనే సందేశం ఎప్పటికప్పుడు ఆయా సమాజలకు చెర వేయడమేనని ఆయన చెప్పారు. హైందవ ధర్మ విలువల ప్రామాణికతకు పెద్ద పీట వేసే హిందువుల పండుగ ఏదన్నా ఉంది అంటే అది శ్రీరామనవమినేనని ఆయన చెప్పుకొచ్చారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వేదాంత భజన మందిరంలో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వాడ వాడలో రంగ రంగ వైభోగంగా జరుపుకోవాల్సిన శ్రీరామ నవమి వేడుకల్ని కొవిడ్ నేపథ్యంలో రద్దు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. కొవిడ్ నిబంధనలకు లోబడి ప్రత్యేక పూజలు నిర్వహించాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మానవ సమాజం కూడా కరోనా పీడ నుండి విముక్తి చెందాలని ఆ భగవంతుడిని ప్రార్దించినట్లు మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.