Minister Jagadish Reddy | వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని మంత్రి జగదీశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయన ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణలో మెయింటెన్స్ ఆఫ్ సప్లైపై వివరాలు ఆరా తీశారు.
ఎంతటి భారీ వర్షాలు సంభవించినా సరఫరా నిరంతరం కొనసాగేలా చూడాలని సూచించారు. విద్యుత్ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా చూడడంతో పాటు రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉండేలా ఆదేశించాలని చెప్పారు. బ్రేక్ డౌన్ అయిన పక్షంలో అత్యవసరంగా పునరుద్ధరించేందుకు అవసరమైన సిబ్బందిని, మెటీరియల్ను అందుబాటులో ఉంచాలని సూచించారు. వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించారు.