మంచిర్యాల, నమస్తే తెలంగాణ/ కోటపల్లి/కాళేశ్వరం, ఏప్రిల్ 13: తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ప్రాణహిత నదీమతల్లిని కోరుకున్నట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. బుధవారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్టలో ప్రాణహిత పుష్కరాలను మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ దంపతులు, ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి తదితరులతో కలిసి పుష్కరుడికి పూజలు చేశారు. పుణ్యస్నానం ఆచరించి, నదికి హారతి ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గోదావరి, ప్రాణహిత జీవనదులుగా ఉండాలని ఆకాంక్షించారు. దేవాదాయశాఖ మంత్రిగా తాను గతంలో గోదావరి, కృష్ణ, తుంగభద్ర ఇప్పుడు ప్రాణహిత పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించడం మహాభాగ్యంగా భావిస్తున్నానని చెప్పారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సాయంత్రం 3:54 గంటలకు పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం దేవస్థాన అర్చకులు పడవలో ప్రాణహిత వైపు చేరుకొని కలశ గణపతి పూజ, పుణ్యాహవచనం, పుష్కర ఆవాహన పూజ చేసి పుష్కర ఘట్టాన్ని ఆరంభించారు. అనంతరం కలశాలతో వచ్చి కాళేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి జలాలతో కాళేశ్వర, ముక్తీశ్వర స్వామికి అభిషేకం చేశారు.