వేములవాడ: రాష్ట్రంలోని ప్రముఖ శైవాలయం వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని (Raja rajeshwara swamy) మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అద్దాల మండపంలో వారికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నూతన సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంక్షేమానికి సంబంధించి తొలి సంతకం చేశానని చెప్పారు. తర్వాత మొదటగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నానని తెలిపారు. నేడు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్ (CM KCR) సాగునీటి రంగానికి ప్రాధాన్యమివ్వడంతో మండుటెండల్లో కూడా చెరువులు కుంటలు నీటితో నిండి కళకళలాడుతున్నాయని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 56 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగడమే దీనికి నిదర్శనమని తెలిపారు.
పేదల దేవుడు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. దాదాపు ఇప్పటికే రూ. 100 కోట్లు వెచ్చించి భూసేకరణ, ఇతరత్రా అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లామన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు పాలకమండలి నియమించామని తెలిపారు. మరో ఐదారు ఆలయాల అభివృద్ధి, పునరుద్ధరణలో భాగంగా పాలకమండలి వెయ్యలేదు, ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.