హైదరాబాద్ : హైదరాబాద్ నెహ్రూ జూపార్కులో ఎప్పటికప్పుడు కొత్త సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. జూపార్కులో ఇవాళ పక్షుల ఎవియారీ, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు ఆధునీకరించిన సఫారీ గేటును మంత్రి ప్రారంభించారు. అనంతరం ఎన్క్లోజర్లోకి వైల్డ్ డాగ్స్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నపిల్లలకు, పెద్దలకు ఆహ్లాదంతో పాటు విజ్ఞానాన్ని నెహ్రూ జూ పార్క్ అందిస్తోంది అని అన్నారు. నిత్యం వేలాది మంది సందర్శకులు జూను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు జూలో కొత్త సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని స్పష్టం చేశారు. పక్షి ప్రేమికులను ఆకట్టుకునేలా జూ పార్కులో సహజసిద్ధంగా ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లలో ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లో కనిపించే అరుదైన 680 రకాల పక్షులను ఇందులో ఉంచాము. రూ. 1.33 కోట్లతో నూతనంగా పక్షుల ఎవియరీని ఏర్పాటు చేశామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
జూ పార్క్లో భద్రత వ్యవస్థను మెరుగుపరచడం, నిరంతర పర్యవేక్షణ, సందర్శకుల కదలికలు, జంతువుల ప్రవర్తనపై అధ్యయనం కోసం 200 సీసీ కెమరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. 380 ఎకరాలలో విస్తరించిన జూ పార్కులో దశలవారీగా మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రెండో దశలో 250 సీసీ కెమరాలను ఏర్పాటు చేస్తామన్నారు. సెంట్రల్ జూ అథారిటీ, జపాట్ నిధులతో రూ. 1.6 కోట్లు వెచ్చించి సీసీ కెమరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
విభిన్న రకాల జంతువులు, పక్షులతో సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్న జూ పార్క్ లోకి కొత్తగా నాలుగు వైల్డ్ డాగ్స్ (ధోలే)ను తీసుకువచ్చామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జంతుమార్పిడి పద్ధతిలో కర్నాటక రాష్ట్రంలోని పిలికుల బయోలాజికల్ పార్క్, మంగళూర్ నుంచి వీటిని తీసుకువచ్చారు. వీటి కోసం ప్రత్యేక ఎన్క్లోజర్లను ఏర్పాటు చేశారు అని మంత్రి పేర్కొన్నారు.