ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో మృతిచెందిన ఫారెస్టు రేంజ్ అధికారి (ఎఫ్ఆర్వో) శ్రీనివాసరావు పార్థివదేహానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాధికారులపై దాడులను ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. శ్రీనివాసరావుపై దాడికి పాల్పడి హత్యచేసిన వారిని తప్పక శిక్షిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఈ ఘటను చాలా సీరియస్గా తీసుకుందన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం, ఇతర బెనిఫిట్స్ కల్పిస్తూ జీవో విడుదల చేసిందన్నారు. ఇక్కడి గిరిజనులతో సమస్య లేదని, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన గుత్తికోయలు అడవులను విచక్షణా రహితంగా నరికివేస్తున్నారని చెప్పారు. అడవులను నరికినట్లు తమ అధికారులను కూడా నర్కుతం, దాడులు చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు.
ఎఫ్ఆర్వో అంత్యక్రియలను ఖమ్మం జిల్లా ఈర్లపుడిలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నారు. మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డి.. శ్రీనివాసరావు పాడెపట్టి ముందు నడిచారు.
మంత్రుల వెంట రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే రెగా కాంతారావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డి ప్రియాంక వర్ఘీస్,
అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ (HoFF) దొబ్రియల్ తదితరులు ఉన్నారు.