హైదరాబాద్ ,సెప్టెంబర్ 10 : ఆరోగ్యానికి నడక, వ్యాయామమే మంచి మార్గమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 4కే రన్ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో నడక, సహజ పద్ధతుల్లో ఆరోగ్యంపై చైతన్యం తేవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజలు నడకను అనుసరించాలని, డాక్టర్లు చెబుతున్నారని, అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడే దారి నడకే అన్నారు. పట్టణ, నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచటంతో పాటు పర్యావరణ పరిరక్షణ, అటవీ భూముల సంరక్షణ కో ఫారెస్ట్ బ్లాకుల్లో అర్బన్ లంగ్స్ స్పేస్ (అర్బన్ ఫారెస్ట్ పార్కులు)గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ అర్బన్ పార్కుల్లో వాకర్స్ ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేస్తుండగా, ఆహ్లాదం, ఆనందం కోసం వీకెండ్లో సందర్శకులు సేద తీరుతున్నారని పేర్కొన్నారు.
రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్లో ఉన్న కొత్తగూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి బోటానికల్ గార్డెన్ను ఉమ్మడి పాలనలో వాణిజ్య అవసరాలకు లీజుకు ఇస్తే దాన్ని అడ్డుకున్న ఘనత ఆ ప్రాంత వాకర్స్కు దక్కుతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాన్ని ఎకో టూరిజం పార్కుగా అభివృద్ధి చేశామన్నాని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.