నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 5: తెలంగాణలో మూడోసారి కూడా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతున్నదన్న సంకేతంతోనే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికల పేరిట కొత్త నాటకాన్ని తెరపైకి తెస్తున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం నిర్మల్ మండలం రత్నాపూర్కాండ్లీ గ్రామంలోని రూ.20 లక్షలతో నిర్మించే ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం ఎన్ని కుట్రలు పన్నినా.. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆరేనని, బీఆర్ఎస్ సర్కారే కొలువుదీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీల ఉనికిని దెబ్బతీసేందుకు కేంద్రం కావాలని జమిలి ఎన్నికల అంశం తెరమీదికి తెచ్చిందని ఆరోపించారు. బీజేపీ ఓడిపోతుందన్న భయంతోనే.. జమిలి పేరిట తెలంగాణలో ఎన్నికలను వాయిదా వేసేందుకు కుట్ర పన్నుతున్నదని, ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.