బాసర, జనవరి 26 : వసంత పంచమి సందర్భంగా గురువారం నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రం భక్తజనసంద్రమైంది. వేకువ జామున 2 గంటల నుంచే అమ్మవారి దర్శనంతోపాటు చిన్నారుల అక్షరాభ్యాసాల కోసం భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. తెలుగు రాష్ర్టాల నుంచేగాక ఇతర రాష్ర్టాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాజ్యసభ సభ్యుడు, నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్రావు, ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్తో కలిసి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు.
దాదాపు లక్షమందికిపైగా భక్తులు రావడంతో అమ్మవారి దర్శనానికి దాదాపు 6 గంటలు, వీఐపీ దర్శానికి 2 గంటల సమయం పట్టింది. కాగా అన్ని విభాగాలు కలుపుకొని రూ.65 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. పూజలుచేసిన అనంతరం మంత్రి అల్లోల మాట్లాడుతూ అమ్మవారి ఆలయ గర్భగుడితోపాటు పలు అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే రూ.50 కోట్లు మంజూరు కాగా, పనులు ప్రారంభించిన తర్వాత మరో రూ.50 కోట్లు ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నదని అన్నారు. కాగా ఎంపీ, నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్రావు తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. తన మనుమడు (కూతురి కుమారుడు) పీ హరీత్రీశ్వర్కు అక్షరాభ్యాసం చేయించారు.