హైదరాబాద్ : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన రన్ ఫర్ పీస్లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ పీస్ అనే పేరుతో శనివారం 10K, 5K, 2K రన్ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ జయంతి రోజున రన్ ఫర్ పీస్ను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశానికి గాంధీజీ చేసిన సేవలను గుర్తు చేసుకోవడం, యువతకు ఆయన ఆదర్శనీయ జీవితం తెలియజెప్పడంతో పాటు ఫిట్ నెస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరూ శారీరకంగా, ఆరోగ్యంగా ఉండడానికి తప్పనిసరిగా వాకింగ్, వీలైతే కొద్దిదూరం పరుగెత్తడం దినచర్యలో భాగం కావాలన్నారు. నిర్వాహకులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.
రన్ ఫర్ పీస్లో పెద్ద ఎత్తున పాల్గొని, విజయవంతం చేసినందుకు నగర ప్రజలకు బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, ఎండీ డా.జి.చంద్రశేఖర్ రెడ్డి, అసోసియేషన్ అధ్యక్షులు చల్లా భరత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెండ్యాల బాలకిషన్ రావు పాల్గొన్నారు.