హైదరాబాద్, జూలై 29 : వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటి డేటాను భద్రపర్చేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ ప్రత్యేకంగా రూపొందించిన వైల్డ్లైఫ్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్ ను మంత్రి అరణ్య భవన్లో ఆవిష్కరించారు.
కిట్ పని తీరు, సాంపిల్స్ సేకరణ, వైల్డ్లైఫ్ DNA పరీక్షల విశ్లేషణ, తదితర అంశాలను వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ (WCS) ప్రతినిధులు మంత్రికి వివరించారు. వన్యప్రాణుల వధించినప్పుడు నేర పరిశోధనలో భాగంగా ఆ ప్రాంతం నుంచి ఆధారాలను సేకరించడం, లేదా అవి సహజ మరణం పొందినప్పుడు కానీ వాటి పాదముద్రలు, గోళ్లు, వెంట్రుకలు, పెంట, మాంసాహార అవశేషాల సేకరించి వాటి డీఎన్ఏ పరీక్షల కోసం Z.S.I., W..I.I., CCMB పంపుతామని తెలిపారు.
విచారణ సమయంలో న్యాయస్థానాల్లో ఈ పరీక్షల రిపోర్టును సమర్పించినప్పుడు..వాటి ఆధారంగా వేటగాళ్లకు శిక్ష పడే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. నేర పరిశోధనలో ఆధారాల సేకరణలో ఫోరెన్సిక్ విభాగం ఎంతో కీలకమైందని, అలాగే అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణకు ఇలాంటి ఆధునిక శాస్త్రీయ పద్ధతులు ఎంతగానో ఉపయోగపడుతాయని మంత్రి అన్నారు.
తద్వారా వేటగాళ్ళు జంతువులను వధించే ఘటనలు తగ్గుముఖం పడతాయని తెలిపారు.
అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్. ఎం. డోబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, అటవీ అభివృద్ధి సంస్థ వైస్ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్రెడ్డి, హైదరాబాద్ టైగర్ కర్జర్వేషన్ సొసైటీ డైరెక్టర్ ఇమ్రాన్, WCS ఇండియా లీగల్ హెడ్ శ్యామ.కే, తదితరులు పాల్గొన్నారు.