నిర్మల్ : నిర్మల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బంగల్ పేట్ వరకు రూ. 5 కోట్లతో నూతనంగా నిర్మించనున్న బి.టి. రోడ్డు పనులను ఆదివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మిషన్ భగీరథ పథకం కింద పైపులు తవ్విన మూలంగా రోడ్డు పనులు ఆపివేశామన్నారు.
ఇప్పుడు మిషన్ భగీరథ పనులు పూర్తి అయ్యేందుకు రూ. 5 కోట్లతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బంగల్ పేట్ వరకు బి.టి. రోడ్డు పనులను ప్రారంభించామన్నారు. మరోవైపు బి.టి. రోడ్డు పనులు పూర్తి కాగానే ఈ రోడ్డు పై లైటింగ్,మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అంతే కాకుండా ఇప్పటికే గాంధీ చౌక్ లో ఉన్న హనుమాన్ ఆలయాన్ని కూడా నూతనంగా నిర్మిస్తున్నామని ఆయన అన్నారు .
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము, అల్లోల మురళీధర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్, పట్టణ కౌన్సిలర్లు, అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.