Minister Indrakaran Reddy | తునికాకు సేకరణకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి (Minister Indrakaran Reddy) తెలిపారు. తునికాకు సేకరణ కూలీలకు బోనస్ చెల్లింపు ప్రక్రియను మంత్రి కుమ్రంభీం ఆసిఫాబాద్ (Kumuram Bheem Asifabad) జిల్లాలో ప్రారంభించారు. సిర్పూర్ నియోజవర్గంలోని కర్జెల్లి రేంజ్లోని చింతలమానేపల్లిలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తునికాకు సేకరించే కూలీలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తునికాకు సేకరణ చార్జీలతో పాటు రెవెన్యూ నెట్ షేర్ (బోనస్)ను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.
ఏజెన్సీ గ్రామాలకు ఇది ఉపాధి వనరని, రాష్ట్రవ్యాప్తంగా 2016 నుంచి 2021 వరకు రూ.200 కోట్లను బోనస్ చెల్లించినట్లు తెలిపారు. బీడీ ఆకుల సేకరణ రేట్ పెంచుతూ జీవోను జారీ చేసినట్లు చెప్పారు. కట్టకు రూ.2.05 నుంచి రూ.3కు పెంచామన్నారు. ఈ సీజన్ నుంచి రేట్లు వర్తింపజేస్తున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ. 277.88 కోట్లను బోనస్ చెల్లింపు ప్రక్రియను ప్రారంభించినట్లు చెప్పారు. లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోనే బోనస్ డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ఈ సీజన్లో 2.27 లక్షల స్టాండర్డ్ బ్యాగుల తునికాకును సేకరించి, విక్రయించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు.
మే నెల చివరి వరకు పూర్తి చేసేలా కసరత్తు చేశామని, సీజన్ లో దాదాపుగా 75వేల మంది తునికాకు సేకరణలో పాల్గొంటారన్నారు. 2023లో తునికాకు సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాల్లో 225 యూనిట్లలో తునికాకును అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అటవీ శాఖ విక్రయిస్తుందన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో తునికాకు కూలీలకు రూ.31.58 కోట్ల బోనన్ను చెల్లించే పక్రియను ఇవాళ ఇక్కడి నుంచే ప్రారంభిస్తామన్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 63,573 మంది లబ్ధిదారులకు రూ.31.58కోట్లు చెల్లిస్తుండగా.. సిర్పూర్ నియోజకవర్గంలోనే 48,418 మంది లబ్ధిదారులకు రూ.26.98 కోట్లు చెల్లిస్తున్నామన్నారు.