రంగారెడ్డి : అర్బన్ ఫారెస్ట్ పార్కులను సరికొత్త థీమ్తో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) వెల్లడించారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు, కోటి వృక్షార్చనలో భాగంగా మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్కును మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అనంతరం పార్కులో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు అర్బన్ లంగ్ స్పేస్ లో భాగంగా పట్టణ, నగరవాసులకు మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. హరితహారం (Haritaharam) కార్యక్రమంలో ఇప్పటి వరకు 283 కోట్ల మొక్కలు నాటామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులకు గాను 74 పార్కులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు.
గతంలో డంపింగ్ యార్డుగా మారిన ఈ ప్రాంతాన్ని అటవీ అభివృద్ధి సంస్థ అర్బన్ ఫారెస్ట్ పార్కుగా తీర్చిదిద్దడంతో ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచే పార్కుగా మారిందన్నారు. ఫారెస్ట్ ట్రెక్ పార్కుకు సందర్శకుల తాకిడి పెరిగిందని ప్రతీ రోజు 3 వేల మంది, వీకెండ్ లో 5 వేల మంది పార్కులో సేదతీరుతున్నారని అన్నారు.
సత్ఫలితాలిస్తున్న హరితహారం : ఎంపీ సంతోష్
చేస్తున్న పని మంచిదైతే దేవుని ఆశీస్సులు కూడా ఉంటాయని ఎంపీ సంతోష్ అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం సత్ఫలితాలను ఇస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 7.7 శాతం గ్రీన్ కవర్ (Green Cover) పెరడగమే దీనికి నిదర్శమని తెలిపారు. దేశంలో మిగితా రాష్ట్రాల్లో పచ్చదనం తగ్గితే తెలంగాణలో అడవుల రక్షణ – సంరక్షణతో గ్రీన్ కవర్ పెరిగిందని వివరించారు. హైదరాబాద్ వెస్టులో ఫారెస్ట్ ట్రెక్ పార్క్ సందర్శకులకు, ప్రకృతి ప్రేమికులకు మంచి సౌకర్యాలు అందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ సభ్యులు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, సీఎస్ శాంతికుమారి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, కలెక్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.