ఢిల్లీ : రాష్ట్ర న్యాయ వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయసాకారాలు అందిస్తుందని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కోర్టు భవనాల నిర్మాణం, న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న సాంకేతికతను వినియోగించుకునే దిశగా అప్ డేట్ కావడం, తదితర మౌలిక వసతులను మెరుగుపరచడం, తగినంతగా న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బంది నియామకం, ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. హైకోర్టు ప్రతిపాదనల మేరకు తక్షణమే నిధులు సమకూరుస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.
శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్ర ముఖ్యమంత్రుల సదస్సులో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ సదస్సుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచేందుకు కృషి చేసిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయ శాఖకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర హైకోర్టులో గతంలో 12 మంది న్యాయమూర్తుల ఉండగా కొత్తగా 17 మంది న్యాయమూర్తులను నియమించి… సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కేసుల సత్వర పరిష్కారానికి మార్గం చూపారని కొనియాడారు. ప్రస్తుతం 29 మంది న్యాయమూర్తులు తెలంగాణ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్నారంటే ఆయన ప్రత్యేక కృషి ఫలితమేనని చెప్పారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి సీజేఐ ఎన్వీ రమణ క్రియాశీల చొరవ తీసుకున్నారని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ఐఏఎంసీ నెలకొల్పేందుకు అవసరమైన మౌలిక వసతులు, స్థలం, నిధులను తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు. ఐఏఎంసీ ఏర్పాటుతో ప్రముఖ సంస్థల్లోని వివాదాలు సత్వరమే రాజీ మార్గం ద్వారా పరిష్కరించడానికి అస్కారం ఏర్పడిందని చెప్పారు. న్యాయ వ్యవస్థలో మౌలిక వసతులను పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
కోర్టుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్న మౌలిక వసతులు, ఖాళీ పోస్టుల భర్తీపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిదని, మౌలికవసతుల కల్పన, ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యతనిస్తూ.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. న్యాయ వ్యవస్థలో పనిభారం తగ్గించేందుకు కొత్తగా 47 కోర్టులను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, వివిధ క్యాటగిరీల్లో 2542 పోస్టులను మంజూరు చేసిందన్నారు. దీని వల్ల సత్వరం కేసులను పరిష్కరించడంతో పాటు కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని పేర్కొన్నారు. కొత్త కోర్టు ల ఏర్పాటుపై హైకోర్టు సిఫార్సులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.
ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక సహాయం విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరమన్నారు. దేశంలో న్యాయస్థానాల నిర్వహణ సజావుగా సాగేందుకు, న్యాయ వ్యవస్థలపై ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్రం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు. పేదలు, బలహీనవర్గాల వారికి ఉచిత న్యాయం సహయం అందించడం, న్యాయపరమైన అవగాహన శిబిరాలను నిర్వహించడం, లోక్ ఆదాలత్ లను నిర్వహించేందుకు రాష్ట్ర న్యాయ సేవా సాధికార సంస్థకు తెలంగాణ ప్రభుత్వం తన సహాయసాకారాలను అందిస్తుందని, అవసరమైన బడ్జెట్ను సమకూరుస్తుందని వెల్లడించారు. ఇ-కోర్టుల ఫేజ్-3 కోసం హైకోర్టు ప్రతిపాదన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగినంత బడ్జెట్ను సమకూరుస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.