హైదరాబాద్ : కృష్ణ శిలలతో నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చరిత్రలో నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరుగనున్న విషయం తెలిసిందే. కార్యక్రమం ఏర్పాట్లు, నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పూజలు, ఉత్సవాలకు ఏర్పాట్లు, ప్రోటోకాల్స్, అతిథులు విడిది చేసేందుకు గదుల కేటాయింపు, నీటి, భోజన వసతి, విద్యుత్ సౌకర్యం, బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, హెల్ప్ డెస్క్ ఏర్పాటు, అధికారులు, సిబ్బందికి బాధ్యతల అప్పగింతపై సమీక్షించి, ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి వైభవాన్ని నలుదిక్కుల చాటేలా సీఎం కేసీఆర్ ఆలయాన్ని పునర్నిర్మించారన్నారు.
తెలంగాణ తిరుపతిగా నిలుస్తుందన్నారు. స్వయంభువుల దర్శనం కోసం భక్తులంతా ఎదురుచూస్తున్నారని, స్వామివారి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతి, 9.30 గంటలకు బాలాలయం నుంచి ప్రధానాలయం వరకు శోభాయాత్ర జరుగుతుందన్నారు. 11.55గంటలకు మహాకుంభ సంప్రోక్షణ తదితర వైదిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. కార్యక్రమం అనంతరం ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న వారిని సీఎం కేసీఆర్ సన్మానిస్తారని మంత్రి తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఈవో గీత పాల్గొన్నారు.