ఆసిఫాబాద్ కుమ్రం భీం : ఆదివాసీల స్వయం పాలన స్ఫూర్తి ప్రదాత కుమ్రం భీం ఆశయ సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రం భీం 81వ వర్ధంతి సందర్భంగా జోడేఘాట్లోని ఆయన విగ్రహానికి బుధవారం మంత్రి నివాళులర్పించారు.
భీం విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గిరిజన హక్కులు, స్వయంపాలన కోసం ఎదురొడ్డి పోరాడినకుమ్రం భీం కీర్తిని ఇనుమడింపచేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఆదివాసీల మనోభావాలను గౌరవిస్తూ వారి సంక్షేమం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు.
రూ.25 కోట్ల వ్యయంతో జోడేఘాట్ భీం సమాధి వద్ద స్మారక స్థూపంతోపాటు, భావితరాలకు భీం చరిత్ర తెలియజేసేలా మ్యూజియం ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని హంగులతో పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఆర్వో ఎఫ్ ఆర్ పట్టాలు ఉన్న గిరిజనులకు రైతుబంధు ద్వారా పంట సహాయం అందిస్తున్నామని తెలిపారు.
అలాగే పోడు భూముల సమస్యను పరిష్కారానికి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు.