నిర్మల్, మే 16 : అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని తీర్చిదిద్దాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్మల్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయ భవన నిర్మాణ పనులు జరుగుతున్న తీరును మంత్రి పరిశీలించారు. పనుల పురోగతి ఏ దశలో ఉన్నాయనేదానిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఐడీఓసీ భవన నిర్మాణంలో భాగంగా ఉద్యాన పనులను, అప్రోచ్ రోడ్, కాంపౌండ్ వాల్, ఆర్చి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యాలయంలో ఉద్యోగులకు, ఆయా పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలన్ని కల్పించాలన్నారు. తాగునీటి వసతి, టాయిలెట్స్ తదితర వసతులన్నీ కల్పించాలని ఆయన సూచించారు.
కలెక్టరేట్ ఆవరణలో పచ్చదనం కోసం మొక్కలు నాటాలన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..ఆగస్టు 15 లోగా పనులన్ని పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఐడీఓసీ భవనాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.
అప్రోచ్ రోడ్, ఇతర సుందరీకరణ పనులు పూర్తయితే నిర్మల్ పట్టణానికి దీని వల్ల అదనపు హంగులు వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అలీ, తదితరులు పాల్గొన్నారు.