నిర్మల్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలిసి తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ పరిశీలించారు. బస్టాండ్ లో మౌలిక సౌకర్యాలపై అధికారులతో ఆరా తీశారు. బస్సులో ప్రయాణిస్తున్న వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెల్సుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడి ఆర్టీసీ అభ్యున్నతికి పాటుపడేలా చూడాలని కోరారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్దన్ మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఆర్టీసీ సంస్థకు చెందిన నిరుపయోగంగా ఉన్న స్థలాలను అవసరాల మేరకు వినియోగించుకుని ఆర్టీసీకి పరిహారం చెల్లించి పనులు చేపట్టవచ్చని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి ఆర్టీసీకి చెందిన స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించినట్లు చెప్పారు. దీంతో మార్కెట్ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లడుతూ.. సమీకృత మార్కెట్ నిర్మాణాకి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి త్వరలో కార్యాచరణ సిద్ధం చేస్తామని తెలిపారు. బస్సుల్లో ప్రయాణించేవారికి అన్ని సదుపాయాలు అందుబాటులో తెచ్చేలా చూస్తామని చెప్పారు.