జనగామ, మే 14 (నమస్తే తెలంగాణ): మందులు, స్కానింగ్ కోసం రోగులను ప్రైవేటుకు రెఫర్ చేసిన జనగామ మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) వైద్యులపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం సిద్దిపేటకు వెళ్తూ మార్గమధ్యలో జనగామకు వచ్చిన మంత్రి నేరుగా ఎంసీహెచ్ ప్రసూతి, శిశువార్డుల్లో ఉన్న పేషంట్ల వద్దకు వెళ్లారు. బాలింతలు, గర్భిణులు వారి బంధువులతో మాట్లాడి దవాఖానలో అందుతున్న సేవలు, సౌకర్యాలు, వైద్యసిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం దవాఖాన మొత్తం కలియదిరిగి పేషంట్లను పలకరించారు. కేసీఆర్ కిట్, మందులు ఇస్తున్నారా?, అన్నం పెడుతున్నారా? అని అడిగి తెలుసుకొన్నారు. దవాఖానలో సేవలు బాగున్నప్పటికీ కొన్ని లోపాలను గుర్తించిన మంత్రి వెంటనే వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణతో ఫోన్లో మాట్లాడారు. ఆస్పత్రి సూపరింటెండెంట్పై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణులను ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు పంపడంపై సీరియస్ అయిన మంత్రి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అనుమతి లేని స్కానింగ్ సెంటర్లను వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు.