సిద్దిపేట, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరెంట్ కావాల్నా..? కాంగ్రెస్ కావాల్నా? ప్రజలు ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆదివారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి మాట్లాడుతూ.. రైతుబంధును కాంగ్రెస్ కాపీ కొట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు రాదని, రైతుబంధు కావాల్నా..? కాంగ్రెస్ కావాల్నా? ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువుల కోసం, లోన్ల కోసం, విత్తనాల కోసం, పంట ఉత్పత్తులు అమ్మడం కోసం, మంచినీళ్ల కోసం లైన్ల నిలబడ్డామని గుర్తుచేశారు. నేడు ఆ పరిస్థితి ఉన్నదా అని ప్రశ్నించారు.
యాసంగిలో రైతుబంధు వేద్దామంటే కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని.. కానీ, న్యాయం, ధర్మం గెలుస్తుంది కాబట్టి ఎన్నికల కమిషన్ రైతుబంధు ఇవ్వడానికి అనుమతిచ్చినట్టు వెల్లడించారు. రేపోమాపో రైతులందరి ఫోన్లకు టింగ్టింగ్ మని రైతుబంధు పడ్డట్టు మెసేజ్ వస్తుందని చెప్పారు. కేసీఆర్ వచ్చిన తరువాత మిషన్ భగీరథ నీళ్లు ప్రతి ఇంట్లోకి వస్తున్నాయా? లేదా? ప్రతి మహిళ ఆలోచించాలని కోరారు.
సీఎం కేసీఆర్కు బీడీలు చేసే కష్టం తెలుసు కనుక.. బీడీ కార్మికులకు పింఛన్ ఇచ్చి ఆదుకున్నారని చెప్పారు. కొత్త ప్రభాకర్రెడ్డి గెలవగానే మిగిలిన పింఛన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిపోయిన రైతుల పంట రుణమాఫీ త్వర లో పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. మొన్నటి వరకు అబద్ధపు హామీలు ఇచ్చిన నాయకులు.. నేడు భూములు తీసుకుంటారని ఇంకో కథ చెబుతున్నారని బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. అసైన్డ్ భూములు ఉన్న ప్రతి లబ్ధిదారుడికి పట్టా భూములు ఇచ్చి యజమానులుగా మార్చుతామని హామీ ఇచ్చారు. 11 సార్లు చాన్స్ ఇస్తే ఎలాంటి అభివృద్ధి చేయని పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.