సిద్దిపేట, నవంబర్ 29 : కేసీఆర్(KCR) చావు అంచుల దాక వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. నవంబర్ 29 దీక్షా దివాస్(Deeksha divas) అనేది ఒక చారిత్రాత్మక రోజని, కేసీఆర్ ఒక ఉద్యమకారుడుగా కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నివాదంతో దీక్షను చేపట్టిన రోజని హరీశ్రావు(Minister Harish Rao) అన్నారు. బుధవారం నవంబర్ 29 దీక్షా దివాస్ను పురస్కరించుకోని సిద్దిపేట పట్టణంలోని రంగధాంపల్లి అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించి అమరులను స్మరించుకున్నారు.
అనంతరం మంత్రి నివాసంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ దీక్షకు వెళ్లేటప్పుడు నా శవయాత్ర లేదా తెలంగాణ జైత్రయాత్రని ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న రోజు నవంబర్ 29 అన్నారు. ఈ దీక్షకు సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తా వేదిక అయ్యిందన్నారు. కేసీఆర్ చేపట్టిన దీక్ష యావత్తు తెలంగాణ సమాజాన్ని కదిలించిందన్నారు. పోరాట ఫలితంగా తెలంగాణను సాధించుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను నిజంచేసిన రోజు, అందుకే దీనిని దీక్షా దివాస్ను ప్రతి సంవత్సరం జరుపుకొంటున్నట్లు తెలిపారు. దీని తెలంగాణ సమాజం గొప్ప స్ఫూర్తిని పొందిందన్నారు. ఆనాటి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ తన దీక్షను పట్టుదలతో కొనసాగించారని తెలిపారు. తన శరీరం సహకరించకున్నా పట్టుదలతో.. మనోనిబ్బరంతో దీక్షను కొనసాగించారన్నారు. కేసీఆర్ దీక్ష ఫలితంగా ఆనాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం నుంచి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంబిస్తున్నట్లు ప్రకటన వచ్చందన్నారు. కేసీఆర్ 11 రోజులు దీక్ష చేయకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదని పేర్కొన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం అప్పటి యూపీఏ ప్రభుత్వం 2004లో రాష్ట్రం ఇచ్చి ఉంటే, 2009 డిసెంబర్9లో ఇచ్చిన మాటను వెనక్కి తీసుకపోకుంటే విద్యార్థుల బలిదానాలు జరిగేవి కావన్నారు. సీమాంధ్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు పోరాడి తెలంగాణ సాధించుకున్నట్లు మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మచ్చ వేణుగోపాల్రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.