హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాలను మలుపుతిప్పే సత్తా గులాబీ జెండాకే ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు, కాంగ్రెస్, బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారని ఆత్మీయ సమ్మేళనాలు తేల్చిచెబుతున్నాయి. ‘ఇంతకాలం సంయమనంతో ఉన్నాం. ఏ తప్పు చేయకపోయినా బీజేపీ, కాంగ్రెస్ బట్టకాల్చి మీదేస్తుంటే ఎందుకు నిశ్శబ్దంగా ఉండాలి’ అని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారనే అక్కసుతో బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. బీజేపీ ఎంత నిలువరించాలని చేస్తే అంతకన్నా వేగంగా బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి ఎదగాలని, అందుకోసం కార్యాచరణ రూపొందించాలని గులాబీ సైనికులు ఆత్మీయ సమ్మేళనాల సాక్షిగా పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 16 నియోజకవర్గాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు తదితరులు ఆత్మీయ సమ్మేళనాల్లో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్, బీజేపీకి పిచ్చిపట్టింది: మంత్రి జగదీశ్రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు పిచ్చిపట్టిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీలకు రాష్ట్రనాయకత్వం వహిస్తున్న ఇద్దరు నాయకలు వీధికుక్కల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరుతోపాటు మోత్కూరులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి మాట్లాడుతూ.. అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, వాటిని బీఆర్ఎస్ శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన నేతలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
చేసిన పనులు ప్రజలకు చెప్పుదాం: పల్లా
టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పాలని రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. హనుమకొండ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగర్లో ఎమ్మెల్యే టీ రాజయ్య అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పల్లాతోపాటు ప్రభుత్వ ఛీప్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు.
విజయం మనదే: విప్ గువ్వల
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే శ్రీరామరక్ష అని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. గ్రామాలు, బస్తీల్లో ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక బీఆర్ఎస్ నాయకులు గుర్తించాలన్నారు. నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలం పోలిశెట్టిపల్లి శివారులోని ఫంక్షన్హాలులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అఖండ విజయం సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో జరిగిన కార్యక్రమంలో 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ నామకరణం చేయడంతోపాటు పంజాగుట్ట చౌరస్తాలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు కృతజ్ఞతగా ఎమ్మెల్యే దానం నాగేందర్, పార్టీ ఇన్చార్జి దాసోజు శ్రవణ్, పార్టీ నేత విప్లవ్ కుమార్ తదితరులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
దేశం తెలంగాణ నాయకత్వాన్ని కోరుతున్నది: మంత్రి హరీశ్రావు
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ సర్కారు అడుగడుగునా అన్యాయం చేస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ ధరలు పెంచితే, బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను పంచిందని తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశమంతా రావాలని, దానికి తెలంగాణే నాయకత్వం వహించాలని కోరుతున్నదని హరీశ్రావు చెప్తుండగా పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మీద రూ.89 వేల కోట్లను సెస్సు రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిందని విమర్శించారు.