హైదరాబాద్ : తాను తొవ్విన గోతిలో తానే పడినట్లు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు పరిస్థితి తయారైంది. నిజాయితీగా పని చేసే వారిపై బురదజల్లితే అభిమానులు ఎలా రాళ్ల వర్షం కురిపిస్తారో తెలిసొచ్చింది. వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పౌర సమాజం భగ్గుమంటున్నది. నిఖార్సైన ఉద్యమకారుడిపై అకారణంగా దూషణలకు పాల్పడి దిగజార్చాలని చూస్తే సీన్ రివర్స్ అయింది.
సోషల్ మీడియా వేదికగా పార్టీలకు అతీతంగా మంత్రి హరీశ్ రావుకు అంతకంతకు మద్దతు పెరుగుతున్నది. మైనంపల్లికి వ్యతిరేకంగా, హరీశ్కు మద్దతుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. దీంతో ట్విటర్ ‘వి ఆర్ విత్ హరీశ్ అన్నా’ #WeAreWithHarishAnna హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ టాప్లోకి వచ్చింది. ఎమ్మెల్యే హనుమంతరావును కఠినంగా శిక్షించాలంటూ ట్వీట్లు, రీట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, తనతోపాటు తన కొడుకు రోహిత్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మైనంపల్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు హరీశ్ రావు అడ్డుపడుతున్నారని, ఆయన అంతు చూస్తానని అన్నారు. మైనంపల్లికి మళ్లీ టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ ఆయన కొడుక్కు మాత్రం నిరాకరించింది. దీంతో రెచ్చిపోయిన మైనంపల్లి మంత్రి హరీశ్రావును టార్గెట్ చేసుకొని విమర్శించడంతో హరీశ్రావు అభిమానులు మైనంపల్లిని శిక్షించి తగు రీతిలో బుద్ధి చెప్పాలని సోషల్ మీడియాలో హోరెత్తించారు.
మరో వైపు మైనంపల్లి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అతడి దిష్టి బొమ్మలను దహనం చేశారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సైతం హరీశ్ రావుకే మా మద్దతు అని ఇది వరకే ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. ఉద్యమ కాలం నుంచి పార్టీకి హరీశ్ రావు వెన్నముకగా నిలిచారన్నారు.