మహబూబ్నగర్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కృష్ణా జలాల్లో నీటి పంపిణీ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్ విజయమని, బీఆర్ఎస్ విజయమని, ఉద్యమ విజయమని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం దేవరకద్ర నియోజకవర్గంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో వాటా కోసం పదేండ్ల నుంచి కొట్లాడుతున్నామని, తెలంగాణ వచ్చిన నెలకే కేసీఆర్ ఢిల్లీకి పోయి జలాలను పంపిణీ చేయాలని, సెక్షన్-3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరారని గుర్తు చేశారు. అప్పుడు కుంభకర్ణుడిలా నిద్రపోయిన కేంద్రం తొమ్మిదిన్నరేండ్ల్ల తర్వాత నిద్రలేచి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. ఏదైనా రాష్ట్రం ట్రిబ్యునల్ వేయమని అడిగితే ఏడాదిలోగా సమస్యను పరిష్కరించడమో, ట్రిబ్యునల్ వేయడమో చేయాలని చట్టం చెప్పిందని గుర్తు చేశారు.
మహబూబ్నగర్కు ఎక్కువ జలాలు దక్కాలి
కృష్ణా జలాల కోసం సుప్రీంకోర్టులో కేసు వేస్తే విత్డ్రా చేసుకుంటే ట్రిబ్యునల్ వేస్తామని కేంద్రం చెప్పిందని మంత్రి హరీశ్రావు గుర్తు చేశారు. వాళ్ల మాటలు నమ్మి విత్డ్రా చేసుకుంటే ఏడాదిన్నర తర్వాత ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకున్నారని, ఏది ఏమైనా ఇది తెలంగాణకు గొప్ప విజయమని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటి దాకా కృష్ణానది నీళ్లన్నీ ఆంధ్రాకు పోయాయని, కృష్ణా నదికి పరీవాహక జిల్లా అయిన మహబూబ్నగర్కు ఎక్కు వ జలాలు దక్కాలని స్పష్టం చేశారు.
తెలంగాణ తెచ్చుకున్నదే మన వాటా మనం తీసుకునేందుకని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో పాలమూరు ప్రాజెక్టు కట్టారని, ప్రాజెక్టుల వారీగా నీళ్లు కేటాయిస్తే రేపు కల్వకుర్తి ఎత్తిపోతలకు నికర జలాలు వస్తాయని వివరించారు. పాలమూరులోని ఒక్కో గుంటకు కృష్ణా జలాలు తెచ్చుకుని ఈ ప్రాం తం రెండు పంటలు పండే కోనసీమలా మా రుతుందని పేర్కొన్నారు. నాడు పాలమూరు అంటే వలసల జిల్లా.. కరువు జిల్లా అని, అది కాంగ్రెసోళ్ల పుణ్యమని ఎద్దేవా చేశారు. నేడు నేడు కేసీఆర్ జమానాలో పాలమూరంటే ఆకుపచ్చని పసిడి పంటలు పండే జిల్లాగా మారిపోయిందని హరీశ్రావు పేర్కొన్నారు.