సిద్దిపేట, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ పథకాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపీ కొడుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రెండు నాల్కల ధోరణికి కేంద్రం కాపీ కొడుతున్న పథకాలే నిదర్శనమని వివరించారు. సోమవారం ఆయన సిద్దిపేటలో చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంతోపాటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. సిద్దిపేట రంగనాయకసాగర్ వద్ద రామంచ శివారులో హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ స్థాపించనున్న రంగనాయకస్వామి బీ ఫార్మసీ కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఆయా కార్యక్రమాల్లో హరీశ్రావు మాట్లాడుతూ.. కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చి మన పథకాలు, మన పాలనపై విమర్శలు చేస్తారని, తీరా ఢిల్లీ వెళ్లాక మన పథకాలనే కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని హర్ఘర్ జల్ పేరిట, చెరువుల బాగు కోసం ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకాన్ని ‘అమృత్ సరోవర్’ పేరిట, రైతుబంధును పీఎం కిసాన్ పేరిట కేంద్రం కాపీ కొట్టిందని తెలిపారు. మూగజీవాలను కాపాడాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 1962 పేరిట 120 అంబులెన్స్లను ఏర్పాటు చేస్తే దానిని కూడా కేంద్రం దేశమంతా అమలు చేస్తున్నదని చెప్పారు.
దొడ్డిదారిన బాయిలకాడ మీటర్లు పెడితే రూ.35 వేల కోట్లు ఇస్తామని కేంద్రం ఆఫర్ చేసినప్పటికీ, రైతుల బాగును కాంక్షించే కేసీఆర్ అందుకు ఒప్పుకోలేదని హరీశ్రావు స్పష్టం చేశారు. మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం 26 శాతం పెరిగిందని విమర్శించారు. కేంద్రప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ పబ్బం గడుపుకొంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. చైనా, పాకిస్థాన్ దేశాల్లో కరువు కారణంగా తెలంగాణ బియ్యానికి డిమాండ్ పెరగడంతో కేంద్రం 20% సుంకం విధించిందని మండిపడ్డారు. కేంద్రం వడ్లు కొనబోమని కొర్రీలు పెట్టిందని, నూకలు తినాలంటూ ఓ కేంద్రమంత్రి హేళన చేశాడని గుర్తుచేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు ప్రభాశంకర్, దేవేందర్రెడ్డి, చంద్రశేఖర్, జైశ్వాల్, అశ్వక్ హైదర్ తదితరులు పాల్గొన్నారు.