హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు (Minister Harish Rao) అన్నారు. టీఎన్జీవో సంఘం గౌరవాధ్యక్షులు దేవి ప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత (Retired Employees) ఉద్యోగులు శుక్రవారం సచివాలయంలో మంత్రి హరీష్ రావును కలిశారు. ఈ సందర్భంగా ఎంప్లాయిహెల్త్ స్కీమ్ (Health Scheme), ఇతర సమస్యలను దృష్టికి తీసుకు రాగా మంత్రి స్పందించారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ( Friendly Government) గా ఖ్యాతి గడించిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఎంప్లాయిహెల్త్ స్కీంను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల ప్రతినిధులు సభ్యులుగా ప్రత్యేకంగా కమిటీ ( Committee) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ స్కీమ్ ద్వారా అత్యున్నత వైద్య సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులోకి వస్తాయన్నారు.
ఉద్యోగులకు అత్యధిక వేతనాలు, పింఛన్లు అందిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలలో మొండిగా ప్రవర్తిస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ (CM KCR ) రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం పై చిత్తశుద్ధితో ఉన్నారని వెల్లడించారు. ఉద్యోగులు, పింఛనర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
మంత్రి హరీశ్ రావును కలిసిన వారిలో తెలంగాణ స్టేట్ గౌట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దామోదర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ చంద్రశేఖర్, ట్రెజరర్ గంగారెడ్డి, పింఛన్ల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య, పూర్ణ చందర్ రావు, నర్సింగా రావు, ఎల్ శ్రీనివాస్ రెడ్డి ఇతర సభ్యులు ఉన్నారు.