హైదరాబాద్ : అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా బాయిల్డ్ చేయడానికి జిల్లాలకు ఆదేశాలు జారీ చేసామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) తెలిపారు. సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశాలతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వర్షాలతో తడిసిన మొత్తం 1.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అత్యవసర బాయిల్డ్ కు ఉత్తర్వులు(Orders) ఇచ్చామని వెల్లడించారు.
వర్షాలతో అత్యధికంగా నష్టపోయిన జిల్లాలైన నల్గొండలో 22వేల మెట్రిక్ టన్నులు, కామారెడ్డి, సిద్దిపేట్, పెద్దపల్లి, సూర్యాపేట కొత్తగూడెంలకు జిల్లాకు 14,706 మెట్రిక్ టన్నులు, నిజామాబాద్లో 14,700, కరీంనగర్లో 7350, యాదాద్రి, జగిత్యాలల్లో 5000వేల మెట్రిక్ టన్నుల చొప్పున బాయిల్డ్ ఆర్డర్లు ఇచ్చామన్నారు. ఇప్పటివరకూ గత సంవత్సరం యాసంగి కన్నా రెండున్నర రెట్లు అధికంగా ధాన్యం సేకరణ చేశామని అన్నారు. గతేడాది ఇదే రోజున 3.23 లక్షా మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించగా ఈరోజు వరక 7.51 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించామన్నారు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకూ 5000 కొనుగోలు కేంద్రాలను( Grain Centres) ఏర్పాటు చేసి 40 వేల మంది రైతుల నుంచి 95 వేల లావాదేవీల ద్వారా 7.51 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని తెలిపారు. ఈ సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.