సంస్థాన్ నారాయణపురం: మునుగోడులో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఒక్కసారి కూడా రాజగోపాల్ రెడ్డి గ్రామాలకు వెళ్లలేదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. స్వార్థ రాజకీయాలు, కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురంలో నిర్వహించిన ముదిరాజ్ సంఘం ఆత్మీయ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి స్వార్థంతో మునుగోడుకు ఉపఎన్నిక వచ్చిందన్నారు. ప్రజలు ఓటేసి గెలిపించేది వారి సమస్యల పరిష్కారం కోసమేనని, సొంత పనుల చక్కదిద్దుకోవడానికి కాదని విమర్శించారు. మునుగోడు ప్రజల కోసం కాకుండా, తన సొంత కాంట్రాక్టుల కోసం పనిచేస్తానని తానే చెప్పుకుంటున్నాడని, అలాంటి వ్యక్తికి ఎందుకు ఓటెయ్యాలన్నారు.
రాజగోపాల్ రెడ్డి ఏ సమస్య పరిష్కారం కోసం రాజీనామా చేశాడని ప్రశ్నించారు. శివన్నగూడెం చెరువుకోసమా, మేళ్ల చెరువు కోసమా లేదా ముదిరాజ్ సొసైటీ కోసమా అని నిలదీశారు. ఐదేండ్లు పోరాడుతాడని మునుగోడు ప్రజలు ఓటేసి గెలిపించారని, వారి సమస్యలపై అసెంబ్లీలో ఒక్క ప్రశ్న కూడా అడగలేదని, ఒక్క మంత్రిని కలిసింది లేదన్నారు. ప్రజల సమస్యలను గాలికొదిలేసి సొంత రాజకీయాలు చేస్తూ రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం పదవికి రాజీనామా చేశాడన్నారు. ప్రజలపై ఆర్థిక భారం మేపే ఉపఎన్నిక ఎందుకోసం వచ్చిందో మునుగోడు ప్రజానీకం ఆలోచించాలని కోరారు.
గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏనాడు గ్రామాలకు రాని వ్యక్తి మళ్లీ నేడు ఓటేస్తే కనిపిస్తాడా అని, అలాంటి వ్యక్తి మనకు అవసరమా అని ప్రశ్నించారు. మునుగోడును పీడిస్తున్న ఫ్లోరోసిస్ను సీఎం కేసీఆర్.. మిషన్ భగీరథతో దూరం చేశారని చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో కల్యాణలక్ష్మీ, రైతుబందు, రైతు బీమా, 24 గంటల ఉచితకరెంటు, గొర్రెల పంపిణీ, ముదిరాజులకు, గంగపుత్రులకు చేపపిల్లల పంపిణీ, పోడుభూములకు హక్కు, గిరిజన రిజర్వేషన్లు, ఉచిత బియ్యం, మద్దతు ధరతో పంటల సేకరణ ఇలా అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో ఉందన్నారు. ఇంత చేస్తున్న ముఖ్యమంత్రికి అండగా నిలవాలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.