కరీంనగర్ : గత ఎన్నికల్లో కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తనపై ప్రతిపక్షాలు చేసిన కుట్రలు వీగిపోయాయని, ప్రజల ఆశీర్వాదంతో నామినేషన్ వేసిన రోజే హైకోర్టు తీర్పు రావడం శుభసూచకంగా భావిస్తున్నానని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. ఎన్నికల వ్యయం పెరిగిందని పొన్నం ప్రభాకర్ వేసిన కేసును బుధవారం హైకోర్టు కొట్టి వేసింది. గతంలో బండి సంజయ్ వేసిన కేసులోనూ హైకోర్టు అతనికి జరిమానా విధించి మొట్టికాయలు వేసిన విషయం విధితమే.
ఈ సందర్భంగా కరీంనగర్లో నామినేషన్ వేసిన అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ.. న్యాయమే దిక్సూచిగా ప్రజాసేవ కోసం పనిచేస్తున్న తనను కరీంనగర్ ప్రజలు ఇప్పటికే వరుసగా ఐదుసార్లు గెలిపించారన్నారు. కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం వెనక ప్రజలతో తనకున్న సాన్నిహిత్యమే కారణమన్నారు.
దీన్ని సహించలేని ప్రతిపక్షాలు కుట్రలతో కేసులు వేస్తే న్యాయం తన పక్షాన ఉంది కాబట్టే వీగిపోతున్నాయని స్పష్టం చేశారు. ఈ తీర్పుతోనైనా ప్రతిపక్షాలు తమ కుత్సిత బుద్ధి వీడి ప్రజాక్షేత్రంలో ప్రజల మన్నన ఉన్న తనను విమర్శించడం మానుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లోను బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయ మన్నారు.