విద్యానగర్( కరీంనగర్) : తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత వల్ల ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెరిగిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. బుధవారం కరీంనగర్లోని శుభం గార్డెన్స్లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో (Decade Celebrations) భాగంగా వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు ఏదైనా రోగం వస్తే ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన’కు అనే రోజులుండేవని, వైద్య రంగం(Medical Sector)లో అనేక మార్పులు,సంస్కరణలు తీసుకురావడంతో ప్రజల్లో నమ్మకం రెట్టింపు అయిందని వెల్లడించారు.
ప్రభుత్వ దవాఖాన(Government Hospitals)లో సాధారణ ప్రసవాలు పెరిగాయన్నారు. ప్రైవేట్ దవాఖానల్లో బిల్లులు చెల్లించలేక ఆస్తులు అమ్ముకునే పరిస్థితి గతంలో ఉండేది. అరకొర వైద్య సిబ్బందితో సకాలంలో కనీస వైద్యం కూడా అందేది కాదు. సీజన్ వ్యాధులు వస్తే అపరిశుభ్రమైన వాతావరణమే కనిపించేదని ఆయన గుర్తు చేశారు. తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్(CM KCR) పాలనలో వైద్యరంగంలో గణనీయమైన పురోగతిని సాధించామన్నారు .
ఉన్నత వర్గాలకు మాత్రమే సాధ్యమయ్యే వైద్య విద్యను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు. వైద్య విద్యను అభ్యసించాలనే పేద విద్యార్థుల కలను నెరవేరుస్తూ తెలంగాణలోని ప్రతి జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. బిడ్డ కడుపులో ఉండగానే తల్లీ, బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రభుత్వం న్యూట్రిషియన్ కిట్లను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణనేనని అన్నారు.
వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, దేవుడు ఇచ్చిన వరంగా భావించి ప్రజలకు సేవలందించాలని వైద్యులకు, సిబ్బందికి సూచించారు. వైద్య సేవలందించిన ప్రభుత్వ దవాఖానా వైద్యులు మంజుల, సాయిని నరేందర్, ఫార్మసిస్టు రాజమౌళి, మిడ్ వైఫరి రమ్యశ్రీ, ల్యాబ్ టెక్నీషియన్ ఉమారాణిలను సన్మానించారు. కలెక్టర్ కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్, కొత్తపల్లి మున్సిపల్ చైర్పర్సన్ రుద్రరాజు, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన మైనార్టీ యువత
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ టౌన్ మైనార్టీ కార్యాలయాన్ని మంత్రి గంగుల ప్రారంభించారు. ఈ సందర్భంగా మైనార్టీ యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.