కరీంనగర్ : కాంగ్రెస్, బీజేపీలకు విలువైన ఓటు వేసి వృథా చేయొద్దని, ఆ రెండు పార్టీలు ఒకటేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని ముగ్ధుంపూర్, మందులపల్లి గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వారికి అధికారం కట్టబెడితే మరోసారి తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసి ఇక్కడి సంపదను కొల్లగొడుతారని మంత్రి అన్నారు.
ఓటు అమూల్యమైనదని ఒక్క ఓటు తప్పు జరిగితే తెలంగాణ మళ్లీ అంధకారం అవుతుందని అన్నారు.
నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు కావాలా..లేదా ఎన్నికలప్పుడే కనిపించి ఆ తర్వాత కనిపించకుండా పోయి.. జైలుకు వెళ్లి వచ్చే నాయకుడు కావాలో ఆలోచించుకోవాలన్నారు. సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
తాను ఎమ్మెల్యే కాక ముందు ముగ్ధంపూర్ ఎలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలన్నారు. ఈ ప్రాంత ఎంపీగా గెలిచిన తర్వాత బండి సంజయ్ ఎప్పుడైనా మీకు కనిపించాడా ప్రశ్నించారు. భూ కబ్జాదారుడు30 కిపైగా కేసులతో బైండోవర్ చేసిన వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని దుయ్యబట్టారు. పచ్చని తెలంగాణను దొంగల చేతుల్లో పెట్టొద్దన్నారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.