హైదరాబాద్ : కరీంనగర్లో టీటీడీ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం అతి త్వరలోనే కార్యరూపం దాల్చబోతుందని మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. అమరావతిలో ఎకరా స్థలంలో నిర్మితమవుతున్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్ రావు, టీటీడీ బోర్డు తెలంగాణ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ భాస్కర్ రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్, వినోద్ కుమార్ శనివారం పరిశీలించారు. కరీంనగర్ నగరం నడిబొడ్డున రూ. 100 కోట్ల విలువ చేసే పది ఎకరాల స్థలాన్ని సీఎం కేసీఆర్ టీటీడీ ఆలయ నిర్మాణం కోసం ఇదివరకే కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు సైతం గతంలోనే ఆమోదం తెలిపింది.
ఆగమ, వాస్తు శాస్త్రం, ఆలయ నిర్మాణ శైలి, గర్భాలయం, అంతరాలయం, అర్థ మండపం, మహా మండపం, ముఖమండపం, గరుడాళ్వార్ సన్నిధి, ధ్వజస్తంభం, బలిపీఠం, తూర్పు రాజ గోపురం, ఉత్తర ద్వారం, ప్రాకార మండపాలు తదితర నిర్మాణ విశిష్టతలను ఆలయ స్థపతులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు ఆలయ ప్రాంగణంలో కలియ తిరిగిన మంత్రి గంగుల సారథ్యంలోని బృందం.. శిలలను ఎక్కడి నుండి తెప్పిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది శిల్పులు పాల్గొంటున్నారు, ఎన్ని రోజుల్లో ఆలయ నిర్మాణం పూర్తవుతుంది తదితర వివరాలను అడిగారు.
అనంతరం టీటీడీ ప్రధాన స్థపతి మునిస్వామి రెడ్డి, సహాయ స్థపతి కృష్ణారావులను తమ వెంట కరీంనగర్కు తీసుకెళ్లారు. రేపు టీటీడీ స్థపతులు, కరీంనగర్ రెవెన్యూ యంత్రాంగం, యాదాద్రికి పనిచేసిన ఆనంద్ సాయి తదితరులు కరీంనగర్లో ఆలయ నిర్మాణం జరగబోయే స్థలాన్ని పరిశీలించి డిజైన్లు ఇవ్వాల్సిందిగా మంత్రి గంగుల ఆదేశించారు. నేడు సందర్శించిన అమరావతి ఆలయం కన్నా మరింత సుందరంగా, మరింత విశాలంగా ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం టీటీడీ ఆధ్వర్యంలో కరీంనగర్ ఆలయాన్ని నిర్మిస్తామని గంగుల కమలాకర్ ప్రకటించారు. ఇప్పటికే పూర్వ కరీంనగర్ జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాలేశ్వరం తదితర పుణ్యక్షేత్రాలకు ధీటుగా కరీంనగర్ టీటీడీ ఆలయ నిర్మాణం ఉండబోతుందన్నారు.