కరీంనగర్: అమరుల త్యాగఫలమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమని, వారి త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య ప్రత్యేక సమావేశానికి గంగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య తదితరులు ప్రాణాలను అర్పించారని, అమరవీరుల త్యాగాల ఫలమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అని చెప్పారు. అమరుల త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.
‘అమరవీరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు. పోలీస్ కిష్టయ్య కుటుంబానికి అండగా నిలిచాం. ఆయన బిడ్డ ప్రస్తుతం డాక్టర్ గా పనిచేస్తున్నది. అమరవీరుల త్యాగాలను మరిచిపోము. ఎప్పటికీ స్మరించుకుంటాం. జనవరి 26న, జూన్ 2న ఆగస్టు 15న కూడా అమరవీరులను స్మరించుకుంటున్నాం. సమైక్య పాలకులు మన గోదావరి నీటిని, మన బొగ్గును దోచుకున్నారు. గోదారి తెలంగాణలో ప్రవహించనంత దూరం ఎక్కడ ఆగకుండా పరుగులు తీసేది. మనకి గోదావరి నది ఉన్నా, ఎన్టీపీసీ ప్లాంట్ ఉన్నా సాగునీటికి, కరెంటుకు ఇబ్బందులు తప్పలేదు. గతంలో సరైన అవకాశాలు లేక యువత దుబాయికి, బొంబాయికి వలసపోయేవారు. అప్పుడు తెలంగాణ ప్రాంతంలో కరెంటు సరిగా లేక పవర్ హాలిడేలు, క్రాప్ హాలిడేలు ఇచ్చేవారు. ఇప్పుడు స్వయం పాలనలో గోదావరి నదిపై కాలేశ్వరం ప్రాజెక్టును కట్టి సాగునీటి ఇబ్బందులు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్దే. మన బొగ్గు మనకు రావడంతో కరెంటు ఇబ్బందులు లేకుండా పోయాయి’ అని మంత్రి గంగుల చెప్పారు.
అనంతరం అమరవీరుల కుటుంబాలను ఆక్కున చేర్చుకొనే తీర్మానానికి సమావేశంలోని సభ్యులు సంపూర్ణ ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా 31 మంది అమరుల కుటుంబ సభ్యులను మంత్రి సన్మానించారు. అనంతరం జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన గ్రామాల సర్పంచులకు, కార్యదర్శులకు మంత్రి సన్మానం చేశారు. అంతకుముందు అమరవీరుల జ్ఞాపకార్థం రెండు నిమిషాలు మౌనం పాటించారు. జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులందరికీ సెల్యూట్ చేస్తున్నా అన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జిల్లా పరిషత్ సీఈఓ ప్రియాంక, జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.