Gangula Kamalaker | హైదరాబాద్ : ప్రభుత్వం మిల్లర్లకు కేటాయించిన ధాన్యంలో ఒక్క గింజను వదులుకోమని, ఒక్క రూపాయిని పోనివ్వమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో మంత్రి గంగుల కమలాకర్ ఈ అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. అక్రమాలు చేస్తున్న, డిఫాల్ట్ మిల్లర్లు అధికంగా ఉన్న సూర్యాపేట, నల్గొండ, వనపర్తి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో పటిష్టమైన టాస్క్ఫోర్స్ను తక్షణమే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మిగతా అన్ని జిల్లాల్లోనూ రిటైర్డ్ పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులతో కట్టుదిట్టమైన టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ధాన్యం అమ్ముకునే మిల్లర్లను, రేషన్ బియ్యం పక్కదారి పట్టడాన్ని గుర్తించి సమాచారం అందించిన పౌరులకు సైతం రివార్డులు అందజేయడంతో పాటు వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామని మంత్రి తెలిపారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ధాన్యం సేకరణ 24 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 141 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని మంత్రి తెలిపారు. ఈ ధాన్యం సేకరణకు అనుగుణంగా మిల్లింగ్ కెపాసిటీ పెరగలేదని, కేవలం గతానికి ఇప్పటికి 2 రెట్లు మాత్రమే పెరిగిందన్నారు. అందువల్ల మిల్లర్లకు అధనంగా ధాన్యం కేటాయింపులు చేయడం జరుగుతుందని, ఇదే అదనుగా భావించి కొన్ని చోట్ల మిల్లర్లు అనైతిక చర్యలకు పాల్పడుతూ ప్రభుత్వం ఇచ్చిన దాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ను ప్రయోగించి 125 శాతం క్యాష్ రికవరీని సైతం వసూలు చేస్తున్నామన్నారు. డిఫాల్ట్ మిల్లర్లు, అక్రమార్కులను ఉపేక్షించేది లేదని ఈ విషయంలో ఎలాంటి పక్షపాతం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల నుండి 90 శాతం రికవరీ చేశామని, మిగతా పది శాతం సైతం వీలైనంత త్వరగా రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయి పౌరసరఫరాల యంత్రాంగంతో పాటు కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించి నిరంతరం పర్యవేక్షణ చేస్తూ రికవరీలో వేగం సాధిస్తున్నారన్నారు.
ఈ యాసంగి సీజన్లోనూ రైతులకు ఇబ్బందులు లేకుండా, మిల్లర్లపై ఒత్తిడి కలగకుండా ఇంటర్మీడియట్ గోదాములను సైతం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దయాకర్ రావు తెలిపారు. వీటితో పాటు మన సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మిల్లింగ్ కెపాసిటీని వాడుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే గత డిఫాల్టర్లకు, అక్రమ మిల్లర్లకు ఒక్క గింజను కూడా కేటాయించబోమన్న మంత్రి, సక్రమంగా సకాలంలో మిల్లింగ్ చేస్తున్న వాటికి మద్దతిస్తూనే ఇంతవరకూ సీఎంఆర్లో పాల్గొనని మిల్లర్లను సైతం ప్రోత్సహించి వారికి ధాన్యం కేటాయింపులు చేసి సకాలంలో మిల్లింగ్ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సకాలంలో సీఎంఆర్ పూర్తి చేయడం, రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి గంగుల కమలాకర్.