హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో తెలంగాణలో సమృద్ధిగా పంటలు పండుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ వానాకాలంలో రైతు పండించిన ప్రతీ గింజాను కొంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సీజన్లో ఒక కోటి మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. 2022-23 వానాకాలం ధాన్యం సేకరణపై వ్యవసాయ, పౌరసరఫరాలు, పోలీస్, మార్కెటింగ్ శాఖలతో మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
అన్ని శాఖల అధికార యంత్రాంగానికి వానకాలం ధాన్యం సేకరణపై మంత్రి గంగుల స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయన్నారు. 24 లక్షల మెట్రిక్ టన్నుల నుండి దేశంలోనే రెండవ స్థానంతో ప్రపంచానికే అన్నం పెట్టేలా 1 కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించామన్నారు. సంపద పెంచాలి దాన్ని పేదలకు పంచాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ విధానమని, సాగు రంగంలో విప్లవాత్మక సంస్కరణలతో తెలంగాణ ప్రభుత్వం ఇందులో విజయం సాధించిందన్నారు.
వ్యవసాయ శాఖ వివరాల ప్రకారం రాష్ట్రంలో గతం కన్నా 3 లక్షల ఎకరాలు పెరిగి దాదాపు 65 లక్షల ఎకరాల్లో వరి సాగైందని మంత్రి గంగుల తెలిపారు. ఇందులో సొంత వాడకానికి, ఇతరత్రా అమ్మకాలకు పోను దాదాపు 1 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని జిల్లా యంత్రాంగం ద్వారా అంచనా వేశామని అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి గంగుల. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుందని, అవసరమైన గన్ని బ్యాగులు, మాయిచ్చర్ మిషన్లు, ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్లతో సహా సిద్ధంగా ఉన్నామని, తెలంగాణ రైతు పండించిన ప్రతి గింజను కొంటామన్నారు.
తెలంగాణలోని 17 జిల్లాలకు ఇతర రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న నేపథ్యంలో విజిలెన్స్తో పాటు పోలీస్ శాఖ ఇతర రాష్ట్రాల నుండి మన కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవడానికి ఒక్క గింజ ధాన్యం రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అధికార యంత్రాంగం కలిసికట్టుగా పని చేయాలన్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క గింజ రేషన్ బియ్యం కూడా రీసైక్లింగ్ జరగకుండా పటిష్ట నిఘాను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే మిల్లర్ల వద్ద ఉన్న దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వీలైనంత త్వరగా మిల్లింగ్ చేసి సీఎంఆర్ అప్పగిస్తూ తగినంత స్టోరేజీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టోరేజ్ విషయంలో అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయలతో పాటు ఇతర రాష్ట్రాలకు తరలించే అంశంపై కూడా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు క్లస్టర్గా ఏఈవోలు ఇచ్చిన సమాచారం ఆన్లైన్ చేశామని, సర్వే నెంబర్ల వారీగా ఏ భూమిలో ఏ రకమైన పంట సాగయిందో ఆ వివరాలు సైతం ప్రస్తుతం డిజిటలైజ్ చేసి అందుబాటులో ఉన్నాయన్నారు. కాబట్టి పంటభూమి లేకుండా ధాన్యం అమ్మడానికి ఆస్కారం లేకుండా చేశామన్నారు, దుక్కి దున్నడంతో మొదలయ్యే రైతు సైకిల్ పంట అమ్మి డబ్బులు అకౌంట్లో పడ్డాకే పూర్తవుతుందని, ఈ ప్రక్రియ సజావుగా సాగేలా ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రజాధనం ఒక్క రూపాయి వృధా కాకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు మంత్రి గంగుల కమలాకర్.
కొనుగోలు కేంద్రాలలో రైతులు పంటను అమ్ముకున్న తర్వాత మిల్లర్లతో ఎలాంటి సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, అందుకు రైతులు సైతం సహకరించాలని కోరారు. ఎఫ్సీఐ ఫెయిర్ యావరేజ్ క్వాలిటీని కచ్చితంగా మెయింటైన్ చేస్తున్నందున రైతులు సైతం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు ఎఫ్ఎక్యూ ప్రమాణాలతో తీసుకొని రావాలని సూచించారు మంత్రి గంగుల. ఈ విధంగా రైతులకు అవగాహన కలిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్తో పాటు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, హోం శాఖ అడిషనల్ డిజి జితేందర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, చీఫ్ రేషనింగ్ అధికారిణి బాల మాయాదేవి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, కోపరేటివ్ అడిషనల్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, డిసిఎస్ఓలు, డిఎంలు, కో-ఆపరేటివ్ శాఖ అధికారులు, సెర్ప్, మెప్మా ప్రతినిధులు పాల్గొన్నారు.