సీఎం కేసీఆర్ ఆదేశాలతో వేగంగా పనులు
డీపీఆర్ సిద్దం చేసిన ఉన్నతాధికారులు
వారంలో టెండర్లు పిలిచేందుకు యంత్రాంగం కసరత్తు
హైదరాబాద్ : కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఈ ప్రాజెక్టు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోందని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో పురోగతి, డిజైన్ల పరిశీలన, క్షేత్ర స్థాయి పనులకు సంబందించి ఇరిగేషన్, టూరిజం, డిజైనింగ్ కన్సల్టేన్సీ, జిల్లా ఉన్నతాధికారులతో జలసౌధలో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
మానేరు రివర్ ఫ్రంట్లో ప్రధాన భాగాలైన బారేజ్, లోయర్ ప్రామినాడ్, అప్పర్ ప్రామినాడ్లకు సంబందించిన డీపీఆర్లను అధికారులు మంత్రికి వివరించారు. ప్రాజెక్టుపై క్షుణ్ణంగా సమీక్షించిన మంత్రి గంగుల పనులు వేగంగా పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 4 కిలోమేటర్ల మేర వివిధ దశలుగా రూపొందే రిటైనింగ్ వాల్ లోయర్, అప్పర్ ప్రామినాడ్లు, బారేజీ డీపీఆర్ ఫైనల్ అయిన నేపథ్యంలో టెండర్లు పిలవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ. 410 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బోటింగ్, అమ్యూజ్ మెంట్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, పౌంటేన్లు, ఆడిటోరియం, మ్యూజియం, కిడ్స్ ప్లే ఏరియాలు, సీనియర్ సిటిజన్ గార్డెన్స్, ప్లవర్ గార్డెన్లు, రాక్ గార్డెన్లు, లేజర్ షోలు, విశాలమైన లాండ్ స్కేపింగ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ప్రాజెక్టులో అంతర్బాగంగా నిర్మించిన తీగల వంతెన నిర్మాణం పూర్తయిందన్నారు. రివర్ బెడ్ నిర్మాణం, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో హాస్పిటాలిటీ ఏర్పాట్లు, చిల్డ్రన్ పార్క్స్, వాటర్ పౌంటేన్స్, బోటింగ్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ ఇతర ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఎన్సీలు మురళీధర్, శంకర్, టూరిజం శాఖ ఈడి శంకర్ రెడ్డి, టీఎస్ టీడీసీ సీఈ వెంకటరమణ, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, ఐఎన్ఐ కన్సల్టేన్సీ డైరెక్టర్ హర్ష్ గోయల్,ఇతర రాష్ట్ర, కరీంనగర్ జిల్లా ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ, మున్సిపల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.