కరీంనగర్ : భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈటల రాజేందర్తో రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత కక్ష లేదు అని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో భౌతిక దాడులు, హత్యల సంస్కృతి లేదన్నారు. ఈటల రాజేందర్ ప్రాణాలకు ఎలాంటి భయం లేదు. ఈటల నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. ఆయనతో తమకెలాంటి పంచాయతీ లేదని స్పష్టం చేశారు. ఈటలకు ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తోందని చెప్పారు.
ఈటల కామెంట్స్పై వెంటనే విచారణ జరిపించాలని డీజీపీ కోరుతున్నాను అని మంత్రి గంగుల తెలిపారు. ఈటలకు నమ్మకం లేకపోతే కేంద్ర సంస్థలతోనే విచారణ జరిపించండి అని చెప్పారు. ఈటల రాజేందర్ ఆయన మద్దతుదారులతోనే దాడి చేయించుకుని ప్రభుత్వంపై నెట్టివేయాలని చూస్తున్నాడు. మాజీ మావోయిస్టు ఏ మంత్రి పేరు చెప్పాడో ఈటల బయట పెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. విచారణలో తన పేరు ఉంటే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఈటల వ్యాఖ్యల్లో నిజం లేకుంటే ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను భయపెట్టే విధంగా ఈటల వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. సానుభూతి కోసం ఈటల ఏమైనా చేయొచ్చు అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.