Gangula Kamalaker |కరీంనగర్ : తెలంగాణ వ్యాప్తంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ నియోజకవర్గంలోని తీగలగుట్టపల్లి, ఖాజీపూర్ గ్రామాల్లో రూ. 5.5 కోట్లతో నూతనంగా మంజూరైన సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి కమలాకర్ శుక్రవారం భూమి పూజ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. సబ్ స్టేషన్ నిర్మాణం వల్ల పలు గ్రామాలకు లో ఓల్టేజీ సమస్య తీరడంతో పాటు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందుతుందని పేర్కొన్నారు. తీగలగుట్టపల్లిలో రూ. 2.5 కోట్లతో, ఖాజీపూర్లో రూ. 3 కోట్లతో 33/11 కేవీ సబ్ స్టేషన్లను నిర్మిస్తున్నామని వెల్లడించారు. మెరుగైన విద్యుత్తు సేవలను అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఇప్పటికే పెరుగుతున్నడిమాండ్కు తగినట్లు సరఫరాపై దృష్టి సారించిన యంత్రాంగం లోవోల్టేజీ సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని కొత్త ఉపకేంద్రాలను ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు.
విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసేలా కృషి చేసిన మంత్రి గంగుల కమలాకర్ను తీగలగుట్టపల్లి, ఖాజీపూర్ గ్రామస్థులు శాలువాలతో సన్మానించారు. గతంలో ఈ ప్రాంతంలో సాగు రైతులు విద్యుత్ సరఫరా లేక ఎన్నో ఇబ్బందులు పడేవారని, వారి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం సంకల్పించినట్లు తెలిపారు. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో విద్యుత్ కోతలతో సతమతమయ్యే వారమని,అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నారన్నారు.