హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): యాసంగి బాయిల్డ్ రైస్ సేకరణ, గత యాసంగి సీఎమ్మార్ గడువు పెంపు, వానాకాలంలో 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఢిల్లీలో వరుస చర్చలు జరిపారు. ఇదే అంశంపై బుధవారం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ మంత్రి పీయూష్ గోయల్తో మంత్రులు కేటీఆర్, గంగుల భేటీ అయిన విషయం తెలిసిందే. పీయూష్ గోయల్ సూచన మేరకు గురువారం ఆ శాఖ కార్యదర్శి సుదాన్షు పాండేతో గంగుల భేటీ అయ్యారు. ఎఫ్సీఐ ద్వారా తెలంగాణ ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సమస్యలను వివరించారు. దీనిపై స్పందించిన సుధాన్షు.. వెంటనే ఎఫ్సీఐ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో అన్ని అంశాలపై కూలంకశంగా చర్చించారు. సమస్యలపై రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ అనిల్కుమార్ నివేదిక అందించారు. పరిశీలించిన ఎఫ్సీఐ ఉన్నతాధికారులు.. కేంద్రానికి నివేదిక అందిస్తామని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.