కరీంనగర్ : నర దృషి పడితే బండలు పగిలే పరిస్థితి అని.. ఢిల్లీ పాలకుల కన్ను తెలంగాణపై పడిందని పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు ఎన్ని ప్రభుత్వాలు మారినా అందరం అరిగోసపడ్డామన్నారు.
తాను రైతు బిడ్డనే అని.. ఆనాడు నీళ్లు లేక ఉన్న భూమిలో సగం బీడుగా వదిలేసే వారమని గుర్తు చేశారు. కరెంట్ లేక, నీళ్లు లేక రైతు అప్పులపాలై.. అనేక ఇబ్బందులు పడ్డామని.. పక్కనే చెరువులు ఉన్నా ఎండిపోయాయన్నారు. కేసీఆర్ ముందుచూపుతో ఆలోచించి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇప్పుడు నీళ్లు నిండుగా ఉన్నాయన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా రైతులు సంతోషంగా ఉన్నారని, రైతుబంధు, రైతుబీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఇప్పుడు భూమికి బరువయ్యేంత పంట పండుతోందని.. దండం లేదు.. దరఖాస్తు లేదన్నారు.
గతంలో ధాన్యం అమ్మాలన్నా.. కొనుగోలు చేయాలన్నా ఇబ్బందులు పడాల్సి వచ్చేదని.. ఎక్కడ చూసినా రైతన్నల ఆత్మహత్యలు జరిగేవన్నారు. ప్రస్తుతం కల్లాల వద్దకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు నేరుగా రైతుల అకౌంట్లలో డబ్బు జమవుతోందన్నారు. కేంద్రం వ్యవసాయ మోటార్లకు మీటర్లు తెచ్చే ప్రయత్నం చేస్తోందని.. మోటార్లకు మీటర్ల పెట్ట అని చెప్పిన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. మళ్లీ విషం చిమ్ముతూ ఢిల్లీ గద్దలు వాలుతున్నాయని.. ఇక్కడి నీళ్లు, విద్యుత్, బొగ్గును తరలించుకుపోయేందుకు చూస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఎంటని ఒకసారి ఆలోచించాలన్నారు. పిల్లలు, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండేదో ఆలోచించాలన్నారు. మళ్లీ పంటలు ఎండిపోయి.. గుడ్డిదీపం అయ్యే పరిస్థితి ఉందని హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసం వస్తారని.. వారంతా ఢిల్లీకి గులాములని.. కేసీఆర్ ప్రభత్వునికి అండగా ఉండాలన్నారు. కేసీఆర్ ధర్మం వైపు.. ప్రజల వైపు ఉన్నారని, దేశం మొత్తంలో పండించిన ప్రతీ గింజను కొనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇక్కడ అవసరం అనుకుంటే అక్కడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు.