కరీంనగర్ : తెలంగాణలోని బీసీ బిడ్డలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా కరీంనగర్(Karim nagar)లో రూ. 27 కోట్లతో నిర్మిస్తున్న బీసీ మహిళా వ్యవసాయ కళాశాల(College) భవనం పనులను త్వరలో ప్రారంభించనున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) తెలిపారు. శుక్రవారం కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధుంపూర్లో మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్స్ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తొలి బీసీ వ్యవసాయ మహిళా కళాశాలను కరీంనగర్లో ఏర్పాటు చేసామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులను ప్రారంభిస్తామన్నారు. గతంలో ఇక్కడి విద్యార్థులు వ్యవసాయ విద్యా నేర్చుకోవాలంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవని పేర్కొన్నారు. ఈ చదువు చదువుకోవాలంటే 25 లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉండేదని అన్నారు.
కరీంనగర్ వ్యవసాయ విద్యాలయం కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశాలు ఉంటాయని, ఇందులో 80శాతం బీసీ మహిళలకు, మిగతా 20 శాతం ఇతరులకు కేటాయిస్తామని అన్నారు. కరీంనగర్ వ్యవసాయ కాలేజీలో నోటిఫికేషన్ ఇచ్చిన గంటలోపే సీట్లన్నీ భర్తీ అయ్యాయని వెల్లడించారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ పై కాంగ్రెస్, బీజేపీలు విషం చిమ్ముతున్నాయని, వారి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
స్వయం పాలనలో సీఎం కేసీఆర్(CM KCR) తీసుకున్న రైతు సంక్షేమ చర్యలతో సాగు విస్తీర్ణం పెరిగి భూమికి బరువయ్యే పంటలు పండుతున్నాయని అన్నారు. వడగండ్లతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని, రైతులు అధైర్యపడవద్దు అని హామీ ఇచ్చారు.