TREIRB | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): సాధారణంగా మనకు ఏదైనా సమస్య వస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తాం. వారు పట్టించుకోకపోతే ఆ శాఖ మంత్రికి కలిసి విన్నవిస్తాం. ఆ మంత్రివర్యులు కూడా పట్టించుకోకుండా ‘వెళ్లండి.. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోండి’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తే.. ఇంకేం చేస్తాం.. న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం..
ఇప్పుడు సరిగ్గా గురుకుల స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల అభ్యర్థులు కూడా ఇదే చేయబోతున్నారు. పోస్టుల భర్తీలో గోల్మాల్ జరిగిందని, తమకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లోని స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275 పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) గత ఏప్రిల్ 24 నుంచి మే 24వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది.
నోటిఫికేషన్లో 2023 ఏప్రిల్ 5వ తేదీనాటికి పీడీ పోస్టులకు బీపీఎడ్ తదితర విద్యార్హతలు ఉన్న అభ్యర్థులే అర్హులుగా ప్రకటించింది. ఆ లెక్కన గత మే నాటికే అభ్యర్థులు ఆయా విద్యార్హతలు కలిగి ఉండాలి. కానీ, గత అక్టోబర్లో పాసైన అభ్యర్థికి సైతం పోస్టింగ్ ఇచ్చిందని అభ్యర్థులు ఆధారాలతోసహా బయటపెట్టారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్కు విరుద్ధంగా పోస్టులను భర్తీచేశారని, ఏపీకి చెందిన నాన్లోకల్ అభ్యర్థులకు పోస్టింగ్లు ఇచ్చారని, జోనల్ పోస్టులను మల్టీజోనల్ పోస్టులుగా మార్చారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ఓ మంత్రిని పలువురు అభ్యర్థులు కలిసి పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలను వివరించారు. న్యాయం చేస్తానని హామీ ఇవ్వాల్సిన మంత్రి.. అందుకు విరుద్ధంగా ‘కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోండి’ అంటూ ఉచిత సలహానివ్వడంతో అభ్యర్థులు ఖంగుతిన్నారు.
చెక్చేస్తాం.. పోస్టులు మాత్రమివ్వం..
పోస్టుల భర్తీపై అనేక ఆరోపణలు వస్తున్నా ట్రిబ్ అధికారులు నోరుమెదపడం లేదు. స్కూల్ పీడీ పోస్టుల అభ్యర్థులకు రాత పరీక్షతోపాటు డెమోలు నిర్వహించాల్సి ఉన్నది. ఆ రెండింటి మార్కులను ప్రకటించాలి. కానీ, ఇప్పటివరకు ట్రిబ్ క్యాటగిరీలవారీగా కటాఫ్ మార్కులను కూడా ప్రకటించలేదు. అభ్యర్థులకు డెమో మార్కులనే వెల్లడించింది. అది కూడా ఓపెన్గా కాకుండా అభ్యర్థులకు వ్యక్తిగతంగా వారి లాగిన్ ఐడీల్లోనే పొందుపరిచింది.
మార్కుల జాబితాను ప్రకటించలేదు. మార్కులు, డెమోకు సంబంధించిన మార్కులను కలిపి కటాఫ్ ప్రకారం వెల్లడించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. స్కూల్ పీడీ పోస్టుల భర్తీ ప్రక్రియపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు ట్రిబ్ ఉన్నతాధికారులను కలిసి విన్నవించుకున్నారు. అభ్యర్థుల ఫిర్యాదు మేరకు జాబితాను చెక్చేస్తామని అధికారులు చెప్పడం గమనార్హం.
ఒకవేళ తప్పు జరిగినట్టు తేలినా ఆ పోస్టులను బ్యాక్లాగ్ పెడతాం తప్ప తదుపరి అభ్యర్థులకు మాత్రం ఇచ్చేది లేదని వెల్లడించారని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆర్డర్ ఉంటేనే ఆ పోస్టులను భర్తీ చేస్తామని చెప్తున్నారని, ఏ ఒక్క ప్రశ్నకు ట్రిబ్ స్పష్టతనివ్వడం లేదని మండిపడుతున్నారు. ఇటు ట్రిబ్ అధికారుల తీరు, అటు ప్రభుత్వ పెద్దల నుంచి నిర్లక్ష్య సమాధానాల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు రిక్రూట్మెంట్ ప్రక్రియపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎవరికి వారుగా పిటిషన్లను దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు.
పీజీటీ పోస్టులపైనా అనుమానాలు..!
స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులపైనే కాకుండా ఇటీవల భర్తీ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులపైన కూడా అభ్యర్థులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అన్ని గురుకులాల్లో కలిపి మొత్తంగా 1,276 పీజీటీ పోస్టుల భర్తీకి ఇటీవల 1ః2 నిష్పత్తి ప్రకారం అభ్యర్థుల జాబితాను విడుదల చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ను నిర్వహించారు. అన్ని సబ్జెక్టులకు ఒకే రోజున, అదీ సమాచారమిచ్చిన ఒక రోజు వ్యవధిలోనే ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు.
అనేక మంది నాన్క్రీమీలేయర్ తదితర సర్టిఫికెట్లను కూడా సమర్పించలేదు. ట్రిబ్ మెడికల్ టెస్టులను కూడా నిర్వహించలేదు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేసిన మరుసటి రోజు అర్ధరాత్రికే పోస్టులకు ఎంపికైన జాబితాను విడుదల చేసేసింది. ఈ పోస్టులకు కూడా ఇప్పటివరకు క్యాటగిరీలవారీగా మార్కుల కటాఫ్ను ట్రిబ్ వెల్లడించలేదు. నిబంధనల ప్రకారం వెబ్లోనూ పొందుపరచలేదు. ఎంపికైన అభ్యర్థుల హాల్టిక్కెట్లను మాత్రమే ప్రకటించింది. దీంతో ఈ నియామకాలపైనా అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.
మీడియాకు మొఖం చాటేసిన ట్రిబ్
స్కూల్ పీడీ, పీజీటీ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో, లేవెనెత్తుతున్న అంశాలపై వాస్తవాలను తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు తొలుత సంప్రదించగా.. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే అంతా నియామకాలు జరిగాయని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని, వాటిని పరిశీలిస్తామని మాత్రమే చెప్తూ దాటవేస్తున్నారు. ఇదే విషయమై కలిసేందుకు పాత్రికేయులు ఎంత ప్రయత్నించినా ట్రిబ్ అధికారులు మాత్రం పూర్తిగా ముఖం చాటేస్తున్నారు. ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్న ఫలితం లేకుండా పోయింది.
నాడు ధర్నా చేయించి.. నేడు మొఖం చాటేసి
616 పీఈటీ పోస్టుల భర్తీకి 2017లో ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసింది. తొలుత ఫిజికల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా చేసిన అభ్యర్థులే అర్హులని ప్రకటించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీపీఎడ్ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం వారిని కూడా పీఈటీ పోస్టులకు అర్హులుగా ప్రకటించింది. అనంతరం పరీక్షను నిర్వహించింది. 1ః2 నిష్పత్తిలో మొత్తంగా 1200 మంది అభ్యర్థులను ఎంపిక చేసి సర్టిఫికేషన్ వెరికేషన్ చేపట్టింది. 600 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన తరుణంలో డిప్లొమా చేసిన అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.
ఆ పోస్టులు తమకు మాత్రమే చెందాలని వాదన మొదలుపెట్టారు. నాటి నుంచి ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ అలాగే పెండింగ్లో పడిపోయింది. ఆ బాధిత అభ్యర్థులతో ప్రస్తుతం ప్రభుత్వంలోని పలువురు పెద్దలే దగ్గరుండి ధర్నా చేయించారు. కాంగ్రెస్ సర్కార్ రాగానే తొలుత ఇదే సమస్యను పరిష్కరించి పోస్టుల భర్తీ చేపడతామని నాడు రేవంత్రెడ్డి సైతం హామీ ఇచ్చారు. కానీ, నేడు గతంలో రాతపరీక్షలు పూర్తయిన స్టాఫ్ నర్స్ మొదలు, ఇతర అన్ని పోస్టుల భర్తీ చేస్తున్నా ఈ సమస్యను పరిష్కరించేందుకు మాత్రం మొఖం చాటేస్తున్నారని అభ్యర్థులు మండిపడ్డుతున్నారు.