హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ)/మలక్పేట: అంధులకు అక్షరజ్ఞానం కల్పించి వారి జీవితాల్లో వెలుగులు ప్రసాదించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ అని దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. నేడు అంధులు అన్నిరంగాల్లో రాణించగలుగుతున్నారంటే, ఉద్యోగాలు చేస్తున్నారంటే.. 200 ఏండ్ల క్రితమే వారి కోసం ప్రత్యేక లిపిని కనిపెట్టిన బ్రెయిలీ పుణ్యమేనని పేర్కొన్నారు. వికలాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మలక్పేట నల్లగొండ చౌరస్తాలోని వికలాంగుల సంక్షేమశాఖ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన బ్రెయిలీ 214వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బ్రెయిలీ పార్కు (వికలాంగుల జాతీయ ఉద్యావనం)లో బ్రెయిలీ (దేశంలో అతిపెద్ద) తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, వికలాంగుల సంక్షేమశాఖ కమిషనర్, జేఎండీ బీ శైలజ, స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బిన్అబ్దుల్లా బలాలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది కూడా మరో రూ.12 కోట్లతో దివ్యాంగులకు పరికరాలను అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. వికలాంగుల సహకార సంస్థలో ఉన్న బ్రెయిలీ ప్రెస్ ద్వారా రాష్ట్రంలోని అంధుల పాఠశాలలకు ఉచితంగా పాఠ్యపుస్తకాల పంపిణీ, బ్రెయిలీ షీట్స్ ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు.
తాను మొదటిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రూ.5-6 కోట్లుగా ఉన్న దివ్యాంగుల బడ్జెట్ను నేడు రూ.56 కోట్లకు పెంచుకున్నామని పేర్కొన్నారు. అనంతరం అర్హులైన అంధులకు ల్యాప్టాప్లను అందజేశారు. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ముద్రించిన బ్రెయిలీ 2023 నూతన క్యాలెండర్ను ఆవిషరించారు. కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమశాఖ జీఎం ప్రభంజన్రావు, ఏడీలు రాజ్గోపాల్, రాజేందర్, హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనితా నాయక్ తదితరులు పాల్గొన్నారు.