వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR ) ఆశీస్సులు, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సహకారంతో వరంగల్ నగరం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli Daykar) వెల్లడించారు. మంత్రి కేటీఆర్(Minister KTR) శుక్రవారం నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా గురువారం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ(BRS Party) కార్యాలయం, వైకుంఠ ధామం. కాజీపేటలో నిర్వహించనున్న బహిరంగ సభ స్థలం, భూమి పూజ జరిగే వరంగల్ నాయుడు పెట్రోల్ బంక్ ప్రాంతాన్ని సందర్శించారు. ఆయా చోట్ల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ వరంగల్ మహానగర అభివృద్ధికి రూ.2,500 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చామని వెల్లడించారు.
రేపు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో రూ. 181. 45 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్(IT Minister KTR) శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్షలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు, సీపీ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.