హైదరాబాద్, మే 18 : వరంగల్ జిల్లా ఖానాపురం వద్ద ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఐదుగురు మృతి చెందడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి, జరిగిన ఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పెళ్లి సామగ్రి కొనుగోలు చేసేందుకు పర్శతండా నుంచి నర్సంపేటకు ట్రాక్టర్ లో వెళ్తుండగా.. ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులోని చెరువు కట్టపై డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ట్రాక్టర్ కట్ట కింద పడిపోయింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు గాయపడగా.. వారిని దవాఖానకు తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతూ.. మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉండగా.. ఇద్దరు పురుషులు ఉన్నారు.