పాలకుర్తి: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం అమ్మాపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అకాల వర్షాల వల్ల జరిగిన నష్టం తప్ప తమకు ఇతర సమస్యలేమి లేవని ఈ సందర్భంగా రైతులు మంత్రులకు చెప్పారు. ధాన్యం రవాణాకు సమయానుకూలంగా లారీలు వస్తున్నాయని మంత్రులకు తెలియజేశారు.
అనంతరం అమ్మాపురం గ్రామంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంత్రులు పరిశీలించారు. అక్కడ శిక్షణ తీసుకుంటున్న మహిళలతో మాట్లాడారు. కుట్టు శిక్షణ ద్వారా తమకు మనోధైర్యం పెరిగిందని, స్వతంత్రంగా బతకగలమన్న నమ్మకం వచ్చిందని ఈ సందర్భంగా మహిళలు చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి ద్వారా తమకు కుట్టు శిక్షణతోపాటు వరంగల్లో ఏర్పాటు చేసిన మెగా టెక్స్టెయిల్ పార్కులో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. కొడకండ్లలో ఏర్పాటు చేయబోయే మినీ టెక్స్టెయిల్ పార్కులో కూడా తమకు ఉపాధి ఉద్యోగ అవకాశాల లభిస్తాయని మహిళలు మంత్రులతో చెప్పారు.
మహిళా సాధికారతలో కుట్టు శిక్షణ అద్భుత పథకం: మంత్రి నిరంజన్ రెడ్డి
మహిళా సాధికారతలో కుట్టు శిక్షణ అద్భుత పథకమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఉచిత కుట్టు శిక్షణను రాష్ట్రవ్యాప్తం చేస్తే బాగుంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచన విధానానికి తగిన పథకం ఉచిత కుట్టు శిక్షణ అని పేర్కొన్నారు. ఉచిత కుట్టు శిక్షణలతో మహిళా సాధికారత సాధ్యమన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా పాలకుర్తి నియోజకవర్గంలో ఉచిత కుట్టు శిక్షణను నిర్వహిస్తున్న మంత్రి ఎర్రబెల్లిని మంత్రి నిరంజన్ రెడ్డి అభినందించారు.