Minister Errabelli Dayaker Rao | మేడారం జాతర మీడియా పాయింట్ వద్ద ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణలో ఎర్రబెల్లి దయాకర్ రావు గట్టి మంత్రి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కేంద్ర గిరిజన అభివృద్ధి శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్కు నొక్కి చెప్పారు. మీడియా పాయింట్ వద్ద మంత్రి ఎర్రబెల్లి ఎదురు పడగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రేణుక సింగ్కు పరిచయం చేశారు. ఎర్రబెల్లిని పరిచయం చేస్తూ, తెలంగాణలో గట్టి మంత్రి అంటూ కిషన్ రెడ్డి చెప్పారు. పంచాయతీ మంత్రి అంటూ కిషన్ రెడ్డి చెప్పగానే, మంత్రి ఎర్రబెల్లి స్పందించారు. పంచాయితీలు పెట్టే మంత్రిని కాను, పంచాయతీలు పరిష్కరించే మంత్రిని అంటూ, రేణుక సింగ్తో అన్నారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి.
అనంతర మంత్రి ఎర్రబెల్లి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కొద్దిసేపు ముచ్చటించి, జాతర ఏర్పాట్లు, సదుపాయాలు ఎలా ఉన్నాయంటూ ఆరా తీశారు. అలాగే మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రి జాతర మొత్తం తిరుగుతూ చేస్తున్న సూచనలు, సలహాలు, సమన్వయం పై భక్తులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.