హైదరాబాద్ : జనగామ జిల్లా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయం గుట్టపై కార్తీకమాసం సందర్భంగా అఖండ దీపాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు- ఉషా దంపతులు వెలిగించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దక్షిణభారతంలోనే మూడో అఖండ జ్యోతిగా పాలకుర్తి అఖండ జ్యోతి పేరుగాంచిందన్నారు. అరుదైన హరిహర క్షేత్రమన్నారు. కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో తులతూగాలని స్వామివారలను వేడుకున్నట్లు తెలిపారు. కాగా, జగన్నాథ్ మఠాధిపతులు కమలేశ్ మహరాజ్ జీ, శైవ పీఠాధిపతి అదీశ్వర ఆనంద స్వామి, వివేకానంద భారతి ఆశ్రమ స్వాములు సుబ్రతో చైతన్య స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయం వద్ద పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.