హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలను మరింత వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రైతు వేదికల తరహాలో మహిళా వేదికలు నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. నాబార్డు, ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సమాఖ్య, ఎనబుల్ సంస్థలు స్వయం సహాయక బృందాలకు జాతీయ స్థాయిలో అవార్డులను అందిస్తుండగా.. కార్యక్రమం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మహిళలకు అవార్డులు, ప్రశంసా పత్రాలు ఇచ్చి అభినందించారు.
జాతీయ స్థాయిలో తెలంగాణకు చెందిన కామారెడ్డి మండల మ్యూచువల్ ఎయిడెడ్ సహకార సమాఖ్యకు మొదటి బహుమతి, దక్షిణ భారత దేశ కేటగిరిలో హనుమకొండ జిల్లా బ్రహ్మదేవరపల్లి మండల మ్యూచువల్ ఎయిడెడ్ సహకార సమాఖ్యకు రెండో బహుమతి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల సంక్షేమం, అభివృద్ధి, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సీఎం.. స్వయం సహాయక బృందాల్లో షూరిటీ లేకుండా రూ.3లక్షల రుణాలు తీసుకున్న మహిళలు దురదృష్టవషాత్తు మరణిస్తే.. రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రుణం కొంత చెల్లిస్తే.. చెల్లించిన మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలతో మహిళల గౌరవం పెరిగిందన్నారు.
మహిళా అభివృద్ధి సంస్థలో సీనియర్స్ ఉన్నారని, మహిళల అభివృద్ధికి వారి సలహాలు అవసరమన్నారు. మాజీ సీఎస్ కాకి మాధవరావు మాట్లాడుతూ పెద్ద పెద్ద వారికే రుణాలు వస్తున్నాయని అంటున్నారని, తెలంగాణలో మహిళలు సైతం కోట్లాది రూపాయలు రుణం తీసుకొని వ్యాపారం చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో 17 రాష్ట్రాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, నాబార్డు మాజీ చైర్మన్లు, చించల, కోటయ్య, సాధన్ సంస్థ సీఈవో మీనన్, బర్డ్ డైరెక్టర్ శంకర్ పాండే, ఏపీ మాస్ వైస్ చైర్మన్ మహిపారాలి, చైతన్య మేనేజింగ్ ట్రస్టీ సుధా కొఠారి, ఏపీ మాస్ సీఈవో సీఎన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.